హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులు అమలు చేస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇలాంటి ఆరు నెలలు ఐదుసార్లు, మూడు రాష్ట్ర బడ్జెట్లు ముగిశాయి. కానీ పీఆర్సీ ఊసే ఎత్తడంలేదు. వేతన సవరణ ప్రస్తావనే చేయడం లేదు. 3.24లక్షల కోట్ల బడ్జెట్లోనూ పీఆర్సీకి, డీఏ చెల్లింపులకు రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో ఈసారి కూడా నిరాశే ఎదురైంది. వేతన సవరణ ఊసేలేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఒక శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే, నెలకు రూ.200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. ఉద్యోగులు 50 శాతం ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువ 25 శాతం ప్రకటించినా నెలకు రూ.5వేల కోట్లు అందే అవకాశం ఉంది. 2023 జూలై 1 నుంచి పీఆర్సీ ఇవ్వాలి.
ఉద్యోగులకు తప్పని అవమానాలు
వేతన సవరణ చేయకపోగా, కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను అనేకసార్లు అవమానించింది. స్వీపర్ జీతం 2 లక్షలంటూ సీఎస్ రామకృష్ణారావు వ్యాఖ్యానించారు. చీఫ్ ఇంజినీర్లు నెలకు రూ.7 లక్షలు పొందుతున్నారని చెప్పారు. విద్యాకమిషన్ ఉపాధ్యాయుల జీతాలెక్కువని వ్యాఖ్యానించింది. గత కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల వేతనాలను 73శాతం పెంచింది. 2015లో 43శాతం ఫిట్మెంట్తో తెలంగాణ ఇంక్రిమెంట్ను వర్తింపజేసింది. ఆ తర్వాత సీఆర్ బిశ్వాల్ కమిటీ.. కేవలం 7.5 శాతం ఫిట్మెంట్ను సిఫార్సు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 30శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది.