Salaries | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి వస్తే ఠంచనుగా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న రేవంత్ హామీ మాటలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడిచినా ఒకటో తేదీన జీతాలు అందని ద్రాక్షగానే మారింది. లైబ్రేరియన్ల దగ్గరి నుంచి చిరుద్యోగుల వరకు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న లైబ్రేరియన్లకు పలు విన్నపాలు, ఒత్తిళ్ల తర్వాత ప్రభుత్వం బుధవారం కొన్ని జిల్లాల్లో వేతనాలు విడుదల చేసింది. మూడు జిల్లాలోని ఉద్యోగులకు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు కూడా ఇప్పటి వరకు అందలేదు. టెస్కో ఇవ్వాల్సిన యూనిఫాం వస్త్రం కొనుగోలు అడ్వాన్స్ను మళ్లించి డిసెంబరు నెల వేతనాలను ఎలాగోలా సరిపెట్టారు. పోలీసుశాఖలోని హోంగార్డులకు ఈ నెల 14, 15 తేదీల్లో వేతనాలు ఇచ్చారు. నేషనల్ హెల్త్మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలామందికి రెండు నెలలుగా వేతన బకాయిలు ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎంలకు మాత్రమే ఒక నెల వేతనం అందించారు. దాదాపు 10వేల మందికి ఇంకో నెల జీతం బకాయి ఉన్నది. మిగతా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి రెండు నెలల వేతనం అందాల్సి ఉన్నది. ఇలాంటివారు సుమారు 5వేల మంది వరకు ఉంటారు.
మ్యానిఫెస్టోకు మంగళం
ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయాన్నే మరిచింది. 20 తేదీ వచ్చినా వేతనాలు అందక చిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జీతాలే కాదు, పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులకు 1-10 తేదీల మధ్యలో పింఛన్లు జమచేయగా, గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ నెల 16న వేతనాలు జమ అయ్యాయి. ధూపదీప నైవేద్యం పథకంలోని అర్చకులకు 20 రోజులు ఆలస్యంగా వేతనాలు అందాయి.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా
కొత్త ఏడాదిలో వేతనాలు రాలే
ఎస్ఎస్ఏలో 19,600 మంది ఉద్యోగులమున్నాం. కొత్త సంవత్సరంలో జనవరి వేతనాలు ఇంకా అందలేదు. పెరిగిన నిత్యావసర ధరలు, ఈఎంఐలు కట్టలేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందించాలి. ఏపీలో మన కంటే రూ.6 వేలు అధికంగా వేతనాలిస్తున్నారు. కాబట్టి వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ అమలుచేయాలి.
– డీ యాదగిరి, సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి
రెండు నెలలుగా జీతాల్లేవు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాకు వేతనాలు రాలేదు. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంతోనే మా కుటుంబాలు సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ కష్టపడేది మేమే. అయినా, వేతనాలు సరిగా ఇవ్వడం లేదు. కొత్త ప్రభుత్వం మాకు వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగుల్లా ప్రతి నెలా 5వ తేదీలోపే జీతాలు అందిస్తుందనుకుంటే నిరాశే మిగిలింది.
– స్వరూప, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి