హైదరాబాదీ సంస్థ ‘గ్రావ్టన్’ రికార్డు
కన్యాకుమారి టు లడఖ్ నాన్స్టాప్ రైడ్
ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
ప్రయాణించిన దూరం 4,011 కి.మీ.
పట్టిన సమయం 164.30 గంటలు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : బైక్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రయాణించడం సాధారణమే. అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్పై (ఈవీ) కన్యాకుమారి నుంచి లడఖ్ వరకు ప్రయాణించారని, అది కూడా ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకున్నారంటే నమ్మగలమా?. ఈ అసాధ్యాన్ని హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘గ్రావ్టన్’ సుసాధ్యం చేసింది. సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి.. చర్లపల్లిలో ఉత్పత్తి చేసిన విద్యుత్ బైక్ ‘క్వాంటా’ రికార్డు సృష్టించింది. ఈ బైక్పై కన్యాకుమారి నుంచి లడఖ్లోని ‘ఖార్దుంగ్ లా పాస్’ వరకు (కే2కే) నిరంతరాయంగా ప్రయాణించినట్టు సంస్థ తెలిపింది. ప్రయాణ దూరం 4,011.9 కిలోమీటర్లు. తద్వారా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నట్టు సంస్థ తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 13న కన్యాకుమారి నుంచి ఈ రైడ్ ప్రారంభం అయ్యింది. 164 గంటల 30 నిమిషాలు (ఆరున్నర రోజులు) నిరంతరాయంగా ప్రయాణించిన తర్వాత లడఖ్ చేరుకున్నారు. ఈ క్రమంలో కనీసం చార్జింగ్ కోసం కూడా ఆగలేదు. నేరుగా బ్యాటరీ మార్చుకోగలగడం ఈ బైక్ ప్రత్యేకత. ప్రతి 10-12 గంటలకు ఒకసారి రైడర్ మారుతూ.. చార్జింగ్ అయిపోయినప్పుడల్లా బ్యాటరీ మార్చుతూ నిరంతరాయంగా ప్రయాణం కొనసాగించినట్టు సంస్థ సీఈవో పరుశురాం తెలిపారు. అన్ని రకాల రోడ్లపై, లడఖ్లోని తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ క్వాంటా సమర్థంగా ప్రయాణించిందని, పనితీరులో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని చెప్పారు. క్వాంటాను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశామని, దేశీయంగా ఉత్పత్తి అయిన విడిభాగాలనే వినియోగిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లిలోని తమ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డు సాధించినందుకు గుర్తుగా బైక్ కొనుగోలుపై ‘కేటుకే’ ఆఫర్ ఇస్తున్నట్టు చెప్పారు. బైక్ ఒకసారి చార్జ్ చేస్తే ఎకో మోడ్లో వందకుపైగా కిలోమీటర్లు, రైడ్ మోడ్లో 80కి పైగా కిలోమీటర్ల వేగంతో దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నామని, మే లేదా జూన్ నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ అభినందనలు
మొట్టమొదటి పూర్తి ‘తెలంగాణ తయారీ’ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని తయారు చేసిన గ్రావ్టన్ టీమ్ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. చార్జి అయిపోయినప్పుడు బ్యాటరీలు మార్చుకునే పద్ధతిలో దీనిని తయారుచేసిన సంగతిని తన సందేశంలో ప్రస్తావించారు. దీని వెనుకనున్న కోర్టీమ్ మన సిరిసిల్ల జిల్లాకు చెందినవారే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. బ్యాటరీ వాహనంపై కూర్చున్న ఫొటోను జత చేశారు.