Etela Rajender | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కొంపకు నిప్పు పెట్టి చలి కాచుకోవడం అంటే ఏమిటో ఈటల రాజేందర్ను చూస్తే అర్థం అవుతుందని ఆరెస్సెస్వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అతలాకుతలం కావడానికి ఈటలే కారణమని, కానీ ఆయన మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. జితేందర్రెడ్డి ట్వీట్పై ఈటల శుక్రవారం స్పందించారు. ‘సీనియర్ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదు’ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై నిజమైన బీజేపీవాదులు ఫైరవుతున్నారు. బీజేపీలో కాంగ్రెస్ తరహా సంస్కృతిని సృష్టించి కమలం కల్లోలానికి కారణమే ఈటల అని పేర్కొంటున్నారు.
పదవుల కోసమే పార్టీలో చేరడం, కొన్నాళ్లకే పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం, రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా పర్యటనలు చేయడం, ఢిల్లీకి వెళ్లి రావడం, రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేయడం వంటివన్నీ సీనియర్ నాయకులు చేయాల్సిన పనేనా? అని ప్రశ్నిస్తున్నారు. చేరికల కమిటీ చైర్మన్ పేరు మీద కనీసం రాష్ట్ర అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా టూర్లకు తిరిగింది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. కోమటిరెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లడం గౌరవం ఇవ్వడమా? అని అడుగుతున్నారు. ఈటల పార్టీలో చేరిన తర్వాతే లీకులు, డిమాండ్లు వంటి సంస్కృతి మొదలైందని గుర్తు చేస్తున్నారు. ఈటల కాంగ్రెస్లోకి వెళ్తాడని, ఫలానా నేతలతో, ఫలానా హోటల్లో చర్చలు జరిపారని లీకులు ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. ఇలా బీజేపీని మునిగే టైటానిక్లా మార్చిన వ్యక్తి.. ఇప్పుడు తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారని మండిపడుతున్నారు.
ఇప్పుడు విజయశాంతి వంతు!
బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని తన్నాలంటూ జితేందర్రెడ్డి రేపిన కాక మర్చిపోకముందే.. తాజాగా విజయశాంతి కూడా ఈ వరుసలో చేరారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ను ఎత్తివేయడంలో నాయకత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ‘సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో బీజేపీ నిర్ణయం ఆలస్యం అవుతున్నదని’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బండిసహా అందరూ నిషేధం ఎత్తివేయాలని కోరుతు న్నా.. అధిష్ఠానం పట్టించుకోవడం లేదన్నట్టుగా పేర్కొన్నారు. ఈ ట్వీట్ కచ్చితంగా రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి చేసిందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని ఒక నాయకుడిపై నిషేధం విధించాలన్నా, ఎత్తివేయాలన్నా రాష్ట్ర పార్టీ నాయకత్వానిదేనని పేర్కొంటున్నారు. ఢిల్లీ నుంచి లేఖలు మాత్రమే వస్తాయని, రాష్ట్ర నేతలు చెప్పిందే అందులో ఉంటుందని అంటున్నారు. రాజాసింగ్పై నిషేధం విధించేందుకు ఉత్సాహం చూపిన బండి సంజయ్, ఢిల్లీ పెద్దలు.. దాన్ని ఎత్తివేయడంపై ఎందుకు ఆస క్తి చూపడం లేదన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. బీజేపీని అభిమానించే యువతలో రాజాసింగ్కే ఎక్కువ క్రేజ్ ఉన్నది. విజయశాం తి అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. సరైన బాధ్యతలు అప్పగించడం లేదని అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.