YS Sharmila | ఇదే మాట వారం, పది రోజుల కిందట అని ఉంటే.. తన పరిస్థితి మరోలా ఉండేదని నాన్ కంటెస్టెడ్ పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లబోదిబోమంటున్నారు. తనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఓ నెల కిందటగానీ చేసి ఉంటే, తన పార్టీని మూసేసి ఉండేదాన్ని కాదని తెగ బాధపడిపోతున్నారట. అసలు షర్మిల ఇంతలా ఎందుకు ఆవేదన చెందుతున్నది? ఆ కథా కమామిషు ఏమిటంటే, తెలంగాణ గడ్డపై రాజన్న రాజ్యం స్థాపించే లక్ష్యంతో వైఎస్ఆర్టీపీని స్థాపించిందామె. మునుపెన్నడూ మరెవ్వరూ చేయని విధంగా మూడున్నర వేల కిలోమీటర్లు ‘పాదాల మీద నడిచే పాదయాత్ర’ చేసి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై, ఆ పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు, ఘాటు విమర్శలు గుప్పించింది. అయినా సీఎం కేసీఆర్ ఏ మాత్రం స్పందించకపోగా చాలా లైట్ తీసుకున్నారు. పాదాలు అరిగేలా తిరిగినా, అరిచి గీపెట్టినా కేసీఆర్ పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశా, నిస్పృహలకు లోనైంది.
ఇక లాభం లేదని తన పార్టీని హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూసింది. అయితే సరుకులేని పార్టీతో ఎలాంటి లాభం లేదని టీపీసీసీని ఫ్రాంచైజీ తీసుకున్న రేవంత్రెడ్డి అడ్డుతగిలారు. ఆమే వద్దూ.. ఆమె పార్టీ వద్దూ అని తేల్చేశారు. దీంతో తన పార్టీని ఎవరికి అమ్మడం లేదు.. తామే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది షర్మిల. పార్టీ టికెట్లను పబ్లిక్ షేర్లుగా విడుదల చేసినా కొనడానికి ఎవరూ సాహసించలేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఆమె పరిస్థితి. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అదేమిటంటే.. తన గురించి ఏ రోజూ నోరు విప్పని సీఎం కేసీఆర్, పార్టీని క్లోజ్ చేశాక నర్సంపేట సభలో ‘వైఎస్ షర్మిల అనే ఆమె మన అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డిని ఓడించేందుకు డబ్బుల సంచులు పంపిస్తుందటా.. మరి ఆయన గెలవాలా? షర్మిల నోట్ల కట్టలు గెలవాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. దీంతో అబ్బా.. పెద్దసార్ ఎంత పనిచేశారు! ఇదే మాట ఓ నెల కిందట అన్నా తన పార్టీ ఎక్కడికో వెళ్లేదనీ, తన జెండా ఎత్తేయాల్సి వచ్చేది కాదనీ బావురుమంటున్నారట. అవును నిజమే, పాపం… షర్మిల పార్టీకి అప్పుడే నూరేండ్లు నిండేవి కాదని జై షర్మిల బ్యాచ్ ఓదార్చుతున్నట్టు వినికిడి.
– వెల్జాల