హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్న ‘వై ప్లస్’ క్యాటగిరీ భద్రతను తిరస్కరించి, కేంద్ర హోంశాఖ భద్రతకు మొగ్గు చూపారు. తమకు ప్రాణహాని ఉందని ఆరోపించిన ఈటల దంపతులు.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రచ్చకెక్కారు. ఈ నేపథ్యంలో ఈటలకు భద్రత కల్పించే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం, డీజీపీతో మాట్లాడి భద్రత కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారి డీసీపీ గోనె సందీప్.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి.. మాట్లాడి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వై ప్లస్ క్యాటగిరీ భద్రత ఇచ్చేందుకు సిబ్బందిని కేటాయించి, జీవో ఇచ్చే క్రమంలో ఈటల రాష్ట్ర భద్రతను కాదని, కేంద్ర ప్రభుత్వ భద్రతకు మొగ్గు చూపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు కూడా కేంద్ర హోంశాఖ ‘వై’ క్యాటగిరీ భద్రతను కల్పించింది. ఇప్పటికే ఐబీ టీమ్, స్టేట్ ఇంటెలిజెన్స్ టీమ్ జాయింట్ రివ్యూ మీటింగ్ నిర్వహించి, ఎంపీ వ్యక్తిగత వివరాలతో పాటు ఆఫీసు, నివాసం దగ్గరి ప్రాంతాల ఫొటోలు సేకరించినట్టు సమాచారం.