హుజూరాబాద్టౌన్/ వీణవంక/కమలాపూర్, ఏప్రిల్ 22: హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి తోడు దొంగలని, ఇద్దరి మధ్య వాటాల పంపకంలో తేడాలు రావడంతో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని తాను రెండేండ్ల కిందటే బయటపెట్టానని గుర్తు చేశారు. దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ఈటల రాజేందర్ బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా హూజూరాబాద్, వీణవంకలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాద పార్టీ అయితే, కాంగ్రెస్ స్కాముల పార్టీ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరే పార్టీ అని చెప్పారు. ఈటల రాజేందర్ ఫ్రస్టేషన్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ తమకు సంస్కారం నేర్పారని, అందుకే నోరుజారడం లేదని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్రెడ్డి ఎవరో ఈటలకు తెలియజేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.