ఆత్మగౌరవానికి తాను నిలువెత్తు నిదర్శనం.. అని జబ్బలు చరుచుకునే ఈటల రాజేందర్పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తుమ్మినా.. దగ్గినా.. ఆత్మగౌరవం అని మీడియా ముందు గగ్గోలు పెట్టే ఈటల.. ఆత్మగౌరవ నినాదాన్ని మరిచారని మండిపడుతున్నారు. సీమంతం కుర్చీలో కూర్చొని పాలతో పాదాభిషేకం చేయించుకోవడమే ఆత్మగౌరవమా? అని సూటిగా అడుగుతున్నారు. అది కూడా నవ్వులు వొలకబొస్తూ.. ముచ్చటగా దళితులతో కాళ్లు కడిగించుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులతో కాళ్లు కడిగించుకోవడమే.. ఈటల రాజేందర్ అసలు సిసలైన ఆత్మగౌరవమా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాలతో పాదాభిషేకం చేయించుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దళిత బంధు పథకాన్ని అడ్డుకోవడానికి హుజురాబాద్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తూ రణరంగం సృష్టించారు. దీంతో ఈటల దళిత ద్రోహి అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. దళితులు అభివృద్ధి చెందడం ఈటలకు ఇష్టం లేదని దళితులు ధ్వజమెత్తారు. ఈటల ఓటమి చవిచూడక తప్పదని టీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు.