DK Shivakumar : కర్ణాటక (Karnataka) లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీనిపై డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థానం దక్కాలంటే విప్లవం లేవనెత్తాల్సిన అవసరం లేదని, కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలుసని చెప్పారు. ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనే విషయంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పార్టీ కేంద్ర నాయకత్వం కర్ణాటక సీఎం మార్పుపై చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తానెప్పుడూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదని శివకుమార్ చెప్పారు. ఆ పదవి ఖాళీ అయినప్పుడే మరొకరికి అవకాశం వస్తుందని తెలిపారు. తాను ప్రజల కోసం పలు పోరాటాలు చేశానని, కానీ పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదని చెప్పారు.
సీఎం స్థానం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తలను సిద్ధరామయ్య కొట్టిపారేశారు. అవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలని అన్నారు. డీకే శివకుమార్కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లను తాను ట్యాపింగ్ చేయించినట్లు విపక్ష నేత అశోక్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలు-తేనె వంటి తమ బంధాన్ని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే వారు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.