జగిత్యాల, ఏప్రిల్ 10 : హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లాలోని నూకపెల్లి వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సోమవారం తెరిచారు. కలెక్టర్ యాస్మిన్ బాషా నేతృత్వంలో దానిని తీశారు. 2018 ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ను తెరిచి అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఏ, 17సీ డాక్యుమెంట్ కాపీలను, సీసీ పుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్ను ఈ నెల 11లోగా సమర్పించాలని అప్పటి రిటర్నింగ్ అధికారి భిక్షపతికి ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషతో పాటు ఆర్డీవో, తహసీల్దార్తో సుమారు 200 మంది అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి ప్రొసీడింగ్స్ను కోర్టుకు పంపారు. కాగా స్ట్రాంగ్రూంలో కేవలం అవసరమైన పత్రాలను తీసుకొని జిరాక్స్ చేసి అధికారులు పంపించారని, ఇంకా వందసార్లు రీకౌంటింగ్ చేసినా ఇదే ఫలితం ఉంటుందని డీసీఎంస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి తెలిపారు.