హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్ ఇంటి నంబర్ల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్లకు డిజిటల్ నంబర్లు ఏర్పాటు చేయనున్నట్టు గత నెలలో అసెంబ్లీ బడ్జెట్లో సమావేశాల్లో రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారులు నార్సింగి, సిరిసిల్ల మున్సిపాలిటీలు, నిజాంపేట కార్పొరేషన్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్షాంశాలు – రేఖాంశాల ఆధారంగా, గూగుల్ ప్లస్ ద్వారా ఆధునిక విధానంలో పరిశీలించారు. ఒక్కో దగ్గర ఒక్కో సమస్యను గుర్తించిన అధికారులు వాటిని క్రోడీకరించి పరిష్కారమార్గాలు కనుగొని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ ఇంటి నంబర్ల ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఆ ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలు కమిషనర్ వద్ద అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నారు. చెత్తసేకరణకు వెళ్లేవారు ఆ డిజిటల్ నంబర్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది ఆ ఇంటికి చేత్త సేకరణకు ఎన్ని గంటలకు వస్తున్నారో తెలుస్తుంది. ఇలా అన్నిసేవల్లో పాదర్శకత రానున్నది. ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉన్నది.