కరీంనగర్ : రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ప్రారంభించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు . బుధవారం కరీంనగర్(Karimnagar) జిల్లాకేంద్రంలోని పద్మనగర్ లో రూ. 21.30 లక్షలతో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానా(Basti Hospital)ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సత్వర వైద్యసహాయాన్ని అందించేందుకు పల్లె, బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటేనే భయపడే రోజులుండేవని, ప్రస్తుతం కార్పొరేట్(Corporate) ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందుతుందని పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడిందని వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక నర్స్తోపాటు, మందులు, రోగనిర్దారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు.
బస్తీ దవాఖానాను ప్రారంభించిన అనంతరం మంత్రి, మేయర్ వైద్యపరీక్షలను చేయించుకున్నారు. అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన యోగా(Yoga Centre) కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, మేయర్ వై. సునీల్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లలితాదేవి, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, గందే మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.