Gruha Jyothi | శివ్వంపేట, మార్చి 6: గృహజ్యోతి పేరిట ఏకంగా భూమికి ఎసరు పెట్టారు కొందరు రియల్ వ్యాపారులు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన రాయెల్లి సులోచన కొన్నేండ్ల క్రితం జీవనోపాధి కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు వలస వెళ్లారు. వారికి కొంతాన్పల్లి గ్రామంలో పట్టా భూమితోపాటు సర్వేనంబర్ 433/6/1లో ఎకరం అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని దక్కించుకునేందుకు రియల్ వ్యాపారులు పక్కా స్కెచ్ వేశారు.
ఈ క్రమంలో గుమ్మడిదలలో ఉంటున్న రాయెల్లి సులోచనకు ఫీల్డ్ అసిస్టెంట్ కుల్ల రాములు ఫోన్చేసి గృహజ్యోతి ద్వారా జీరో బిల్లు పొందేందుకు సంతకాలు కావాలని, వెంటనే గ్రామానికి రావాల్సిందిగా కోరాడు. దీంతో మంగళవారం సులోచన తన కొడుకు శ్రీనివాస్తో కలిసి గ్రామానికి వచ్చింది. గ్రామపంచాయతీ వద్ద భూమి అమ్మకం పేరిట పత్రాలు సిద్ధం చేశారు.
ఈ క్రమంలో బాండు పేపర్లపై సంతకాలు తీసుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ కుల్ల రాములు ప్రయత్నిస్తుండగా సులోచన కొడుకు శ్రీనివాస్ గుర్తించాడు. వంద రూపాయల బాండ్లపై సేల్డీడ్తోపాటు రశీదు పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాల్లో సులోచనకు సంబంధించిన ఎకరం భూమి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి, లక్ష్మీనగర్ కాలనీకి చెందిన పసుపులేటి సుదర్శన్కు రూ.6.50 లక్షలకు అమ్మినట్టు రాసి ఉంది.
దానిని గమనించి బాండ్ పేపర్లు లాక్కుని తల్లీకొడుకులు ఫీల్డ్ అసిస్టెంట్ను నిలదీశారు. పలువురు రియల్ వ్యాపారుల ఒత్తిడి మేరకు ఈ పని చేశానని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయెల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహిపాల్రెడ్డి తెలిపారు.