హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. సాగునీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వానికి తెలంగాణ సమాజం, రైతాంగం తగిన బుద్ధి చెప్పి తీరుతుందని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు మళ్లీ తెరలేపారని ఆరోపించారు. షాబాద్ మండలంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు దారుణహత్యకు గురై 24 గంటలు గడిచినా నిందితుడిని పట్టుకోలేకపోవడం ప్రభుత్వం, పోలీస్శాఖ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిందితుడిని పట్టించిన వారికి రూ.2 లక్షల బహుమతి ప్రకటించడమే శాంతిభద్రతల వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యమని తెలిపారు. ఈ ఘోర ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని పాత ఆరోపణలే మళ్లీ చేశారని ఎద్దేవా చేశారు.