హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నీటిని ఒడిసిపట్టడం, వినియోగించడం, పొదుపు చేయడంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యూహం మిగతా రాష్ట్రాలకు, కేంద్రానికి విభిన్నమైందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గూడెం, తండాలకు కూడా నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. నీటి సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలు, ప్రణాళికాబద్ధ చర్యలపై నీటి నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.