జనగామ : బాబా సాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ల స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జనగామలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్.. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు జగ్జీవన్ రామ్ దళితుల కోసం తమ జీవితాలను ధారపోశారన్నారు.
వారిద్దరు భావితరాలకు ఆదర్శనీయులన్నారు. వారి స్ఫూర్తిని నింపుకున్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరుగుతుందన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకం అమలవుతున్నదన్నారు. రాజ్యాంగం విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని, రాజ్యాంగ సహా, రాజ్యాంగ నిర్మాతలు అంటే కేసీఆర్కు ఎంతో గౌరవం ఉందన్నారు.
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు అంశాలను కేంద్రం తన చేతుల్లో పెట్టుకుందని, మనకు సరైన న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలన్నదే సీఎం కేసీఆర్ భావన అన్నారు. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువుగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న సమయంలో.. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. దళితులు ఆర్థిక సాధికారతను సాధించేలా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 17లక్షల కుటుంబాలకు పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నారని, దళితులు సీఎం కేసీఆర్ను కాపాడుకోవాలని, అండగా ఉండాలన్నారు.