తొర్రూర్: భక్తి మార్గాన్ని అనుసరించే వారి జీవితం పరమానందభరితం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్లోని శ్రీ మురళీకృష్ణ మందిర త్రయోదశ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు.
అయితే, భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన జీవిత సత్యాలను పోతనామాత్యుడు అత్యంత సహజంగా, మధురంగా మనసుకు హత్తుకునే విధంగా అర్థం చేశాడని మంత్రి తెలిపారు. గీతా సారం జీవితానికి సోపానంగా ఉంటుందన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని, భగవద్గీత మార్గాన్ని ఎంచుకొని జీవిస్తే జీవితం పరమానంద భరితంగా మారుతుందని, సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. తనకు ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.