Errabelli Dayaker Rao | వరంగల్ : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హన్మకొండలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను ఒక్కోచోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. దసరా రోజున పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారంలా పరస్పరం పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోరాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని, అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని తెలిపారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందన్నారు. విజయాలు సాధిస్తూ, సీఎం కేసీఆర్ కుటుంబం సహా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.