Minister KTR | దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వేల మంది మహిళలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొర్రూరులో సభ పెడుతున్నాం రావాలని ఆహ్వానించారు. వడ్డీ లేని రుణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే రూ.750కోట్లు, అభయహస్తానికి సంబంధించిన రూ.545కోట్ల తొర్రూరు మహిళ సాక్షిగానే ఇస్తాను అని చెప్పారు.
స్త్రీ నిధికి సంబంధించి రూ.5.69కోట్లు, బ్యాంకు లింకేజీ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన రూ.204కోట్లు ఇక్కడి నుంచే ఇస్తామని చెప్పి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. రూ.1,550 కోట్లు మహిళా దినోత్సవం రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సీఎం కేసీఆర్ తరఫున చిరుకానుకగా అందజేయడం జరుగుతున్నది. ఎర్రబెల్లి దయాకర్రావు భారతదేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. నేను చెప్పిన మాటకాదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ సందర్భంలో అవార్డులు ప్రకటించినా.. ఎక్కడ అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఉన్నయ్ అంటే.. తెలంగాణేలోనే ఉన్నయని కేంద్రం స్వయంగా చెబుతున్నది’ అన్నారు.
‘సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం ఉన్నది. పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని, దాన్ని అభివృద్ధి చేయడం కార్యక్రమం ఉద్దేశం. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భారతదేశంలో అతి ఉత్తమమైన 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నయ్ లెక్క తీస్తే.. అందులో 19 మన తెలంగాణేలోనే ఉన్నయ్. గత ఆరు నెలలకు సంబంధించిన ర్యాంకుల విడుదలయ్యాయి.
త్రీస్టార్, ఫోర్స్టార్ పేరుతో జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్, రేటింగ్స్ వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖతోనే ర్యాకులు వస్తాయి. త్రీస్టార్, ఫోర్స్టార్లో ఒకటి నుంచి ఆరు ర్యాంకులకు అవార్డులు ఇస్తే.. ఇందులో నాలుగు జిల్లాలు తెలంగాణావే ఉన్నయ్. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నది. గ్రామస్థాయి వార్డు సభ్యుడు, కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అందరూ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పని చేస్తున్నందుకే అవార్డులు వస్తున్నయ్’ అన్నారు కేటీఆర్.