రవీంద్రభారతి, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. బేడ, బుడగ జంగాలను మొదట గుర్తించింది కేసీఆరే అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మంగళవారం బేడ, బుడగ జంగాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహాసభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. బుడగ జంగాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యం వచ్చే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయ జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాలోని తన నియోజకవర్గంలో బేడ, బుడగజంగాల విద్యావంతులు, మేధావులు చాలా మంది ఉన్నారని, వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. బుడగజంగాలకు దళితబంధుతోపాటు డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలతోపాటు నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అని కొనియాడారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల్లో బేడ, బుడగజంగాలు చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు. బేడ బుడుగజంగాల నాయకులు కోరిన న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో బేడ బుడగ జంగాల చైతన్య వేదిక ఆలిండియా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం, నాయకులు తూర్పాటి జగదీశ్వర్, కోడిగంటి నర్సింహులు, సిరిగిరి మన్యం, కత్తి మల్లయ్య, కోడిగంటి నర్సింహ్మ, చింతల గిరి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.