పెద్దవంగర, అక్టోబర్ 9: దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పీడ పోవాలె.. జాతీయ పార్టీ బీఆర్ఎస్ రావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి కలెక్టర్ శశాంకతో కలిసి శంకుస్థాపన చేసి, భూమి పూజ చేశారు. అలాగే 107 మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ.6 కోట్ల బ్యాంకు రుణాలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చేపట్టని సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి కలుగుతున్నదని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల వారు కోరుకొంటున్నారని, అందుకోసం ఆయన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీజే పీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.