హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా హరితహారం లక్ష్యసాధనకు తోడ్పాటునందిస్తామని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం టీఎస్ఐఐసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హరితహారంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని, కాలుష్యం నియంత్రణలో ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.