శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17: వాతవరణ సమతుల్యతపై అవగాహన కల్పిస్తూ ఓజోన్ పొర సంరక్షణపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్వాన్ సంస్థ అధ్వర్యంలో ‘మై ప్లానెట్ మై రెస్పాన్సిబిలిటీ’ అనే థీమ్తో నిర్వహించిన ఓజోన్ రన్ 2వ ఎడిషన్కు సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2కే, 5కే, 10కే రన్లో గెలుపొందిన విజేతలకు ఎంపీ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ అధ్వర్యంలో విత్తన గణపతులను ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ఓజోన్ రన్ను జెండా ఊంపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతవరణ కాలుష్యాన్ని ఆరికట్టడానికి ఈ తరహా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మెచ్చుకున్నారు. గ్రీన్ చాలెంజ్ ద్వారా లక్షల మొక్కలు నాటుతూ తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ సంతోష్కుమార్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఓజోన్ రన్ వ్యవస్థాపకురాలు మేఘన ముసనూరి, సెక్రటరీ శ్రీధర్తో తదితరులు పాల్గొన్నారు.
అటవీ మార్గాల్లో బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి: ఎంపీ సంతోష్
వన్యప్రాణుల ఆవాసాల గుండా ప్రయాణించే సమయంలో బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని ఎంపీ సంతోష్ సూచించారు. పుణె- పండరీపూర్ అటవీమార్గంలో గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టడంతో నడిరోడ్డుపై పడి ఉన్నది. దీంతో వాహనాలన్నీ దానిని తప్పించుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఘటనను ఓ జర్నలిస్టు వీడియోలో బంధించడంతో అది సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఎంపీ సంతోష్ ట్విట్టర్లో పంచుకున్నారు. ‘ఈ దృశ్యం హృదయ విదారకంగా ఉన్నది. ఒక గంభీరమైన చిరుతపులి వాహనం ఢీకొనడంతో గాయపడి.. రోడ్డుపై పడి ఉన్నది. ఇది వన్యప్రాణుల సంరక్షణ, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రాముఖ్యతను గుర్తుచేస్తున్నది. వాటి ఆవాసాల గుండా ప్రయాణించేటప్పుడు, వన్యప్రాణుల భద్రతను, మన భద్రతను గుర్తించి మరింత జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.