KTR | హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఏప్రిల్ 16న బెంగళూరు వేదికగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ‘ఆంత్రప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్- 2026’కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ పాలనలో స్టార్టప్లు, పారిశ్రామిక, ఐటీ వృద్ధికి అందించిన సేవలు, తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా రూపొందించడంలో చేసిన కృషికి గాను ఈ గుర్తింపు సొంతమైంది. ఈ మేరకు సోమవారం కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వాన లేఖ పంపారు.
గురువారం బెంగళూరు వైట్ఫీల్డ్లోని షెరటన్ గ్రాండ్ హోటల్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో దేశవ్యాప్తంగా ఉన్న 300మందికి పైగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, వ్యాపారరంగ నిపుణులు ఒకే వేదికపై ఆసీనులు కానున్నారు. దేశ ఆర్థిక పురోభివృద్ధిలో పాలుపంచుకుంటున్న దార్శనిక నాయకులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో కేటీఆర్ చూపిన డైనమిక్ లీడర్షిప్ను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఆయన తీసుకొచ్చిన ప్రగతిశీల విధానాలు, స్టార్టప్ ఎకో సిస్టమ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చాయని ఇన్విటేషన్ లెటర్లో ప్రస్తావించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించాలని, ఆయన మాటలు యువ పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు.