హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ‘హైటెక్’ హంగులు సంతరించుకోనున్నాయి. ఏదైనా రోగం వస్తే చికిత్స అందించేందుకే పరిమితమైన పీహెచ్సీలు ఇకపై వ్యాధుల నివారణ, నియంత్రణ, ప్రజలకు ఆరోగ్య అవగాహన, సమాచార సేకరణ, విశ్లేషణ, ఆరోగ్య అధ్యయనం.. ఇలా అనేక అంశాలకు కేరాఫ్గా మారనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తాజాగా పీహెచ్సీలో పబ్లిక్ మేనేజ్మెంట్ పర్సన్లను నియమించాలని, ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 630 పీహెచ్సీల్లో త్వరలో ఇందుకు ఏర్పాట్లు జరిపేందుకు కసరత్తు చేస్తున్నది.
పీహెచ్సీ వ్యవస్థలో ప్రస్తుతం డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల బృందం ఉన్నది. అయితే వారు వ్యాధులు వచ్చిన తర్వాత మాత్రమే చికిత్స అందించగలుగుతున్నారు. అలా కాకుండా సీజనల్ ఫీవర్లు, అంటువ్యాధులు వంటివి వ్యాప్తి చెందేకన్నా ముందే గుర్తించి, అధికారులను హెచ్చరించగలిగే వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పీహెచ్సీల్లో ప్రత్యేకంగా పబ్లిక్ మేనేజ్మెంట్ పర్సన్స్ను నియమించనున్నారు. వీరు పీహెచ్సీ పరిధిలో ఏ కాలంలో ఎక్కువగా ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి? కారణాలు ఏమిటి? వంటివి విశ్లేషించనున్నారు. వాటి నివారణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టాలో సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తారు. అంతేకాదు.. ఆ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తే విశ్లేషణ జరిపి, పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తారు. మరోవైపు.. ప్రజల్లో ఆరోగ్య అలవాట్లు పెంపొందించడానికి కృషి చేస్తారు.
ప్రస్తుతం వైద్యశాఖ మొత్తం డిజిటల్ బాట పడుతున్నది. క్షేత్రస్థాయిలో ఉన్న ఆశాలు మొదలు ఉన్నతాధికారుల వరకు సమాచార సేకరణ, బట్వాడా మొత్తం ఆన్లైన్లోనే జరుగుతున్నది. వైద్య సిబ్బంది అటెండెన్స్ మొదలు రోజువారీ సేవలు, ఓపీ, ఐపీ రోగుల వివరాలు, వారికి అందించిన ఔషధాలు, స్టాక్, పరికరాల నిర్వహణ, వ్యాక్సిన్లు వంటివన్నీ ఆన్లైన్లో నమోదు చేయాల్సి వస్తున్నది. ఆశా కార్యకర్తలు గర్భిణుల వివరాలను సేకరించడం, ఏఎన్సీ, పీఎన్సీ చెకప్ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయడం, ఏఎన్ఎంలు వారి పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులనుపై నివేదికలను రూపొందించడం వంటివన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే సాగుతున్నాయి. ఇందుకోసం ఆశాలకు ప్రభుత్వం ఫోన్లు, ఏఎన్ఎంలకు ట్యాబ్లు అందజేసింది. ప్రస్తుతం ఈ విధులన్నీ వైద్యసిబ్బందే చూస్తుండటంతో వారిపై కాస్త పనిభారం పడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి పీహెచ్సీలో ప్రత్యేకంగా ఐటీ వింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా ఆపరేటర్ను నియమించి సమాచార, రికార్డుల నిర్వహణ మొత్తం వారికే అప్పగిస్తారని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.