హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఆయా కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం ప్రకటనతో ఉక్రెయిన్ వెళ్లివచ్చిన వైద్య విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా వందల మంది విద్యార్థులు చదువు మధ్యలో వదిలేసి వచ్చారు. భవిష్యత్తు ఏమిటో అర్థంకాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి చదువు కొనసాగించడంపై కేంద్రానికి లేఖ రాస్తామని, అవసరమైన ఖర్చులు భరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో భరోసా లభించింది. దేశంలోని వైద్యవిద్య మొత్తం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధీనంలో ఉన్నది. ఎన్ఎంసీ నిర్ణయం, మార్గదర్శకాల ప్రకారం.. మన రాష్ట్ర విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అండగా ఉండనున్నది.
కేసీఆర్కు ధన్యవాదాలు: మహేశ్ బిగాల
వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లి తిరిగొచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంపై టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం వల్ల రాష్ట్రానికి చెందిన 740 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇలాంటి ఆపతాలంలో అండగా ఉంటామని కేసీఆర్ ప్రకటించడం మా నవీయ కోణానికి నిదర్శమని ధన్యవాదాలు తెలిపారు.