హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ రైతులకు భారీగా లాభాల పంట పండుతున్నది. గత నెలలో టన్ను గెల ధర రూ.22,842 పలికి, ఆల్టైం రికార్డు సృష్టించింది. ఈ నెలలో కూడా నెల రూ.22,765 ధర పలుకుతున్నది. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికితోడు ప్రధాన ఎగుమతిదారు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించడం వంటి పరిణామాలు వంటనూనెల కొరతను సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో సన్ప్లవర్ నూనె, పామాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రాష్ట్రంలో సైతం రైతులు సాగుచేస్తున్న ఆయిల్పామ్కు మంచి ధర లభిస్తున్నది.
ఒక ట్రాక్టర్ లోడ్ను ఫ్యాక్టరీకి తీసుకొస్తే రూ.లక్ష వరకు లభిస్తున్నదని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక రైతు పేర్కొన్నారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు కనీసం లక్షన్నర మిగులుతుందని చెప్తున్నారు. ఆయిల్పామ్కు గతంలో ఈ స్థాయి ధరను ఎవరూ ఊహించలేదు. టన్నుకు రూ.10 వేలు లభిస్తే అదే మహాభాగ్యం అనే పరిస్థితి మూడేండ్ల క్రితం వరకు ఉండేది. 2015లో టన్ను ధర గరిష్ఠంగా రూ.6,811 నమోదైంది. 2018లో తొలిసారిగా పదివేలు దాటింది. 2020లో గరిష్ఠ ధర రూ.12,800 పలుకగా 2021లో అమాంతం రూ.19,114కు చేరింది. ప్రస్తుతం రూ.22,765 వరకు లభిస్తున్నది. ఏడేండ్లలో టన్ను ధర ఏకంగా మూడు రెట్లకుపైగా పెరగడం విశేషం. ఇతర పంటల మాదిరిగా ఆయిల్పామ్ పంటకు మద్దతు ధర లేదు. ఆయిల్పామ్కు కూడా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం ఇటీవల నిర్ణయించినప్పటికీ, అది ఆచరణలోనికి రాలేదు.
తెలంగాణ మిషన్..ఆయిల్పామ్
పామాయిల్కు ఉన్న డిమాండ్ను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. సాగు చేసే రైతులకు ఇప్పటికే భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2022-23 సంవత్సరంలో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 52 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతున్నది. ఇందులో ఈ ఏడాది సుమారు 15 వేల ఎకరాల్లో నూతనంగా ప్లాంటేషన్ చేశారు. వచ్చే ఏడాది 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ఇప్పటికే సుమారు కోటి ఆయిల్పామ్ విత్తనాలను సిద్ధం చేశారు.