రాయపర్తి, జూన్ 18: ‘ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన ఉపాధ్యాయులుంటారని, మీ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని’ ఓ ఉపాధ్యాయుడు ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. రాయపర్తికి చెందిన భాస్కర్రావు జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ బడులను బతికించాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
అందులో భాగంగానే.. మైక్ పట్టుకొని మండల కేం ద్రంలోని 14 వార్డులు, గిరిజన తండాలు, దళితవాడల్లో పొద్దంతా బైక్పై తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధనతోపాటు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నట్టు వివరించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు చేస్తున్న విష ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు. తన మాటలతో ప్రజల దృష్టిని ప్రభుత్వ బడులవైపు మళ్లించడంతోపాటు తల్లిదండ్రుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించారు.