న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదని హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 19న విగ్రహాల నిమజ్జనోత్సవం జరుగుతుందని, ఇప్పటికిప్పుడు హైకోర్టు ఆదేశించిన మేరకు పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేమని, ఈ ఏడాదికి గతంలో మాదిరిగానే నిమజ్జనం జరిపేందుకు అనుమతించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వం బుధవారం ప్రత్యేకంగా నివేదించింది. ఎస్ఎల్పీని విచారణకు అనుమతిస్తున్నామని, గురువారం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందని ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని కొందరు ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా, మరికొందరు మాత్రం చివరి మూడురోజుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే గణనాథులను పీవీ మార్గ్ తీరానికి తరలిస్తున్నారు. అధికారులు మాత్రం కోనేరు (బేబీ పాండ్) లోనే పీవోపీ విగ్రహాలతో పాటు ఎకో ఫ్రెండ్లీ గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. ఈ కోనేరుల వద్ద ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల తాలూకూ వ్యర్థాల తొలగింపు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. విగ్రహాలు, వాటికి సంబంధించి అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తా చెదారాన్ని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ యంత్రాంగం వెంట వెంటనే తొలగిస్తున్నది.