Nagarjuna Sagar | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవు’ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల చెప్పిన మాట. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో సరిపడా నీళ్లు లేవని, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీళ్లను వాడుకున్నదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పేర్కొన్నది. రాష్ట్ర సర్కారు, కేఆర్ఎంబీ వాదనలు పరస్పర విరుద్ధంగా ఉండగా మరోవైపు క్షేత్రస్థాయిలో కృష్ణాబేసిన్లోని ప్రజలు తాగునీటికి తీవ్రంగా తండ్లాడుతున్నారు. ఈ పరిస్థితికి నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని పలువురు ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు. మే నెలాఖరు వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కూడిన త్రిసభ్య కమిటీ గత అక్టోబర్ 6న సమావేశమైంది. అప్పటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో 92.78 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ను 805 అడుగులు, సాగర్ ఎండీడీఎల్ను 505 అడుగులుగా నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి మే ఆఖరు వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి గత అక్టోబర్లోనే త్రిసభ్య కమిటీ కేటాయించింది. ఈ కోటాలో తెలంగాణ జనవరి 30 నాటికే 31.17 టీఎంసీలను వినియోగించుకోగా, మార్చి10 నాటికి కోటాకు మించి 4.74 టీఎంసీలను అదనంగా వినియోగించుకున్నదని కేఆర్ఎంబీ తెలిపింది. మే ఆఖరు వరకు తాగునీటి కోసం మొత్తంగా 8.90 టీఎంసీలు అవసరమవుతాయని, ఆ మేరకు నీటిని విడుదల చేసేందుకు అనుమతివ్వాలని తెలంగాణ సర్కారు ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీకి లేఖ రాసింది. అయితే, జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడా లేవని, కోటాకు మించి ఇప్పటికే వినియోగించుకున్నందున అదనపు జలాలను కేటాయించేందుకు అంగీకరించబోమని తెలంగాణకు బోర్డు తేల్చిచెప్పింది. గత అక్టోబర్లో త్రిసభ్య కమిటీ నిర్ణయించిన కోటానే పాటించాలని సూచించింది. ప్రభుత్వం మాత్రం జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడా ఉన్నాయని, తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని చెప్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కృష్ణా బేసిన్లోని ప్రజలు తాగునీటికి తీవ్రంగా అల్లాడుతున్నారు. ఒకవైపు తాగునీటికి ఢోకా లేదంటున్న ప్రభుత్వం మరెందుకు సరఫరా చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది కృష్ణాబేసిన్లో క్రాప్హాలిడే ప్రకటించి కేవలం తాగునీటి అవసరాల కోసమే రిజర్వాయర్లలోని జలాలను కేటాయించారు. కృష్ణాబేసిన్లో తెలంగాణకు ఏడాది పొడవునా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 16.5 టీఎంసీలు, పబ్లిక్ యుటిలిటి కోసం దాదాపు నాలుగు, సాగర్కింద 11.69 మొత్తంగా 43.94 టీఎంసీలు అవసరమవుతాయని లెక్కలు చెప్తున్నాయి. త్రిసభ్య కమిటీ మే ఆఖరు వరకు 35 టీఎంసీలను కేటాయించగా, మార్చి 10 నాటికే 39.743 టీఎంసీలను వినియోగించింది. అంటే 4.743 టీఎంసీలను అదనంగా తెలంగాణ వాడుకున్నది. అందులో అక్టోబర్ నుంచి మార్చి 10 నాటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 17 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ ద్వారా 12.745 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 12 టీఎంసీలను వినియోగించింది. బేసిన్లో ప్రాజెక్టుల పరిధిలోని ఒక్క చెరువును కూడా ఈ ఏడాది నింపలేదు. మరి ఆ జలాలను ఎక్కడ వినియోగించారనే అంశం తెలియరావడం లేదు. మరోవైపు కృష్ణాబేసిన్ పరిధిలోని పాలేరు, సూర్యాపేట, నల్లగొండ తదితర ప్రాంతాల ప్రజలు తాగునీటికి తీవ్రంగా తండ్లాడుతున్నారు.
ప్రస్తుతం కృష్ణా బేసిన్లో తాగునీటి సమస్యలకు ప్రధాన కారణం ప్రభుత్వ నీటి నిర్వహణ లోపమేననే విమర్శలున్నాయి. గతంలో ప్రభుత్వం ప్రతి నవంబర్ లేదా డిసెంబర్లో చెరువులను నింపుతుండేది. ఫలితంగా భూగర్భ జలమట్టం కూడా పడిపోకుండా ఉండడమే కాకుండా తాగునీటికి ఢోకా ఉండేదికాదు. పెర్కోలేషన్ (నీరు భూమిలోకి ఇంకిపోయే స్వభావం) సిస్టమ్ కూడా స్థిరంగా ఉండేది. దీంతో కాలువల ద్వారా నీటిని విడుదల చేసే క్రమంలో నీటి సరఫరా నష్టాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ, ఈ ఏడాది ప్రభుత్వం గత విధానాలకు స్వస్తి పలికింది. రిజర్వాయర్లలో సరిపడా జలాలు లేవని, తాగునీటికే సరిపోతాయంటూ ఈ ఏడాది చెరువులను నింపలేదు. వెరసి పెర్కొలేషన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నది. చెరువులను నింపకపోవడం వల్ల భూగర్భ జలమట్టం కూడా తీవ్రస్థాయిలో పడిపోయింది. ఆయా కాలువలకు నీటి విడుదలకు సంబంధించి నిర్దేషిత షెడ్యూలేదీ పాటించలేదు. అధికారులకు ఆ వెసులుబాటు కల్పించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఒత్తిడి చేసి తమ తమ ప్రాంతాలకు నీటిని విడుదల చేయించుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నీటి సరఫరాలో రవాణా నష్టాలు గతంలో కంటే తీవ్రమయ్యాయి. ఇటీవల నాగార్జునసాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు మూడు టీఎంసీల జలాలను విడుదల చేయగా, తుదకు పాలేరుకు 0.8 టీఎంసీలకు మించి చేరలేదని అధికారులు వివరిస్తున్నారు. దాదాపు 2.2 టీఎంసీల జలాలను నష్టపోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా నీటిసరఫరా వ్యవస్థనే అస్తవ్యస్తంగా తయారై తాగునీటి కష్టాలకు కారణమైంది.
మరోవైపు ఏపీ తనకు కేటాయించిన 45 టీఎంసీలకు సంబంధించి ఏ నెలలో ఏ మేరకు నీటిని విడుదల చేయాలనే షెడ్యూల్ను ముందస్తుగానే నిర్ణయించుకుని ఆ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ను అందజేసి దానినే అనుసరిస్తున్నది. క్రమపద్ధతిలో నీటిని వినియోగించుకుంటున్నది. ఎగువన శ్రీశైలంలో నీటిని వినియోగించుకోలేకపోయామని చెప్పి జనవరిలో ఐదు టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి తీసుకున్నది. అదే సాకుతో ఫిబ్రవరిలో సాగర్ ఎడమ కాలువ ద్వారా రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజులపాటు మొత్తంగా అదనంగా మరో రెండు టీఎంసీలను వినియోగించుకున్నది. మార్చి నెలకు సాగర్ కుడికాలువ ద్వారా మూడు టీఎంసీలకు వినియోగించుకుంటుండగా, ఏప్రిల్కు ఐదు టీఎంసీలను విడుదల చేయాలని ఇప్పటికే బోర్డుకు ఏపీ లేఖ రాసింది. మొత్తంగా నెలవారీగా నీటిని క్రమపద్ధతిలో వినియోగించుకుంటున్నది. కానీ, తెలంగాణ మాత్రం ఏపీ తరహాలో ఎలాంటి షెడ్యూల్ను పాటించలేదని తెలుస్తున్నది. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ రెండు రిజర్వాయర్లలో కలిపి ఇప్పటికీ పది టీఎంసీలకుపైగా జలాలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. అయినప్పటికీ, బోర్డు మాత్రం అదనపు జలాలు కేటాయించేది లేదని చెప్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిన దాఖలాలేకపోవడం గమనార్హం.