సిద్దిపేట : ప్రతి విద్యార్థిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనేదే ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంకల్పం. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోయినా, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆందోళన చెందుతారు ఆ టీచర్లు. హాజరు కాలేకపోయినా విద్యార్థి ఒక కొత్త విషయాన్ని మిస్ అవుతాడనే ఆందోళన ఆ ఉపాధ్యాయుల్లో కనిపిస్తుంది. అలా.. ప్రతి విద్యార్థి బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. గత పది రోజులుగా స్కూల్కు రాని ఓ విద్యార్థి కోసం.. టీచర్ ఏకంగా ఆ ఇంటికి వెళ్లి బైఠాయించారు. విద్యార్థిని బడికి పంపించాలని వేడుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 64 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతిలో మాత్రం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ ఆరుగురిలో నవీన్ అనే స్టూడెంట్ గత పది రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదు. దీంతో నవీన్ పాఠాలు మిస్ అవుతున్నాడని, ఆ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రధానోపాధ్యాయుడు ఆందోళన చెందాడు.
ఈ క్రమంలో ఇంగ్లీష్ టీచర్ ప్రవీణ్ కుమార్ను నవీన్ ఇంటికి ఇవాళ ఉదయం పంపించారు. ఇక ఇంగ్లీష్ టీచర్ నవీన్ ఇంటి ముందు బైఠాయించి, అతన్ని స్కూల్కు పంపాలని, లేదంటే నష్టపోతాడని తల్లిదండ్రులకు ప్రవీణ్ కుమార్ వివరించారు. అవగాహన కల్పించిన అనంతరం నవీన్ను అతని తల్లిదండ్రులు ప్రవీణ్ కుమార్ వెంట స్కూల్కు పంపించారు.