హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల్లోని అడవిబిడ్డలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు గిరిజన బిడ్డలు ముందుకు రావడం లేదని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేసేందుకు సిద్ధమవుతున్నది. దీనిలో భాగంగా 326 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రాంతాల్లోని 1,432 ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చనున్నది. ఇందుకోసం దాదాపు రూ.30.75 కోట్లు (లైబ్రరీలు, ల్యాబొరేటరీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.25.76 కోట్లు, ఉపాధ్యాయుల శిక్షణకు రూ.5.08 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేసిన గిరిజన సంక్షేమ శాఖ.. మొత్తంగా 1,758 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 1,05,000 మంది విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఉపాధ్యాయులకు శిక్షణ
ఆంగ్ల మాధ్యమం బోధనపై ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలోని ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 5,200 మంది ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ గుర్తించిన 57 మంది స్టేట్ రిసోర్స్ పర్సన్లకు అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఆధ్వర్యంలో 5 రోజులపాటు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఒక్కొక్క స్టేట్ రిసోర్స్ పర్సన్ 15 మంది ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 855 మందికి ఐటీడీఏల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 25 నుంచి ఈ శిక్షణ ప్రారంభమయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు దశల వారీగా ఇచ్చే శిక్షణ జూన్ 12 నాటికి పూర్తిచేయనున్నారు.
ఇంగ్లిష్ మీడియం ఏ తరగతులకంటే..
ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న 326 ఆశ్రమ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభం కానున్నది.
అయితే ప్రస్తుతం 9వ, 10వ తరగతుల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం తెలుగులోనే విద్యాబోధన చేయనున్నారు.
1 నుంచి 5వ తరగతి గిరిజన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్నవారి మాతృభాష (కోయ, గోం డు, కొలామీ, బంజారా) సబ్జెక్ట్ యథాతథం గా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు.
326 ఆశ్రమ పాఠశాలల్లోని 10 పీవీటీజీస్ (పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్) స్కూళ్ల విద్యార్థులకు ప్రస్తుతం వారి మాతృభాషలో కొనసాగుతున్న బోధన విధానమే అమలులో ఉంటుంది.
గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న 326 ఆశ్రమ పాఠశాలల్లో బాలికలవి 200, బాలురవి 126 ఉన్నాయి. వీటిలో దాదాపు 80 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 25 వేల మంది విద్యార్థులు ఉన్నారు.