హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు ఈఎన్సీ (జనరల్)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు లేని అధికారాలను డిప్యూటీ ఈఎన్సీకి కట్టబెట్టింది. ఇది ఇంజినీర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అన్ని విభాగాల నుంచి ఈఎన్సీ (జనరల్)కు ప్రతిపాదనలు రావడం, అదే సమయంలో ఆదేశాలు వెళ్లడం పరిపాటి. ఆ ఫైళ్లు ఈఎన్సీ జనరల్ కింద ఉండే ఎస్ఈ ద్వారా ముందుకు సాగుతాయి. కానీ, ఆ ఫైళ్ల మూవ్మెంట్ డిప్యూటీ ఈఎన్సీ ద్వారా కొనసాగాలని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈఎన్సీ జనరల్కు కింద ఉండే సబార్డినేట్ నుంచే ఫైల్ మూవ్మెంట్ కొనసాగాలని ప్రత్యేకంగా చెప్పడంలో ఆంతర్యమేంటని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదీ ఈఎన్సీ జనరల్ పోస్ట్ను చులకన చేయడమేనని మండిపడుతున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రతిపాదనలు, సాంకేతిక విషయాలను డ్యామ్ సేఫ్టీతోపాటు, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నేరుగా ఈఎన్సీ జనరల్కు పంపేది. ప్రస్తుతం ఆ ఫైళ్ల మూవ్మెంట్ కూడా డిప్యూటీ ఈఎన్సీ ద్వారానే జరగాలంటున్నది ప్రభుత్వం.
అంతర్రాష్ట్ర జలవివాదాలు, ఇతర రాష్ర్టాలతో సంప్రదింపులు, నీటి కేటాయింపులపై కేంద్రంతో సంప్రదింపులు జరిపే బాధ్యతలతోపాటు, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ యాక్టివిటీలను ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) నాగేందర్రావుకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, తుంగభద్ర రివర్ బోర్డుల్లో మాత్రం ఆయనను మెంబర్గా నియమించలేదు. ఈఎన్సీ (జనరల్)గా అదనపు బాధ్యతలను చేపట్టిన అనిల్కుమారే మెంబర్గా కొనసాగుతారనడంపైనా ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.