హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ఉండదని ఆ రాష్ట్రం మళ్లీ వితండ వాదనకు దిగుతున్నది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్వాటర్తో తెలంగాణలో 890 ఎకరాలు ముంపునకు గురవుతాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలతో నిర్వహించిన అధ్యయనంలో తేలినా ఆ రాష్ట్రం పట్టించుకోవడం లేదు. గత
సమావేశాల్లో ఉమ్మడి సర్వేకు సమ్మతించిన ఏపీ సర్కారు ఇప్పుడు మాట మారుస్తూ ముంపు ఉండబోదని ఆయా రాష్ర్టాలకు లేఖలు రాయడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించడంతోపాటు ఏకాభిప్రాయం సాధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ వాదనలకే వంతపాడటం చర్చనీయాంశంగా మారింది.
ఏపీకి సీడబ్ల్యూసీ మద్దతు
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీ ముంపు ప్రమాదం పొంచి ఉన్నదని, ప్రాజెక్టు గరిష్ఠ నీటి సామర్థ్యం (ఎఫ్ఆర్ఎల్) 150 అడుగులు నిల్వ చేస్తే 891 ఎకరాలు మునిగిపోతాయని, మారిన డ్యామ్ డిజైన్ వల్ల ముంపు మరింత పెరుగుతుందని, ఇటీవల భద్రాచలం వద్ద వచ్చిన వరద ఉద్ధృతిని కేంద్ర జలసంఘానికి తెలంగాణ స్పష్టం చేసింది. బ్యాక్వాటర్ కారణంగా నదీ తీరా లు, పెద్దవాగు, ఈదుళ్లవాగు, పాములేరు వాగు, తురుబాకవాగుతోపాటు మొత్తం 31 ప్రధాన, మధ్యస్థ వాగుల వెంట డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వరదల ప్రభావం 60 గ్రామాలపై ఉంటుందని, 40,446 ఎకరాలు నీటమునగడంతోపాటు, 28 వేల మంది నిరాశ్రయులవుతారని వెల్లడించింది. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ 11 అంశాలను సీడబ్ల్యూసీకి గతంలోనే విన్నవించింది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలు కూడా దాదాపు తెలంగాణ వ్యక్తపర్చిన అభ్యంతరాలనే వెల్లడించాయి.
వాటిపై ఏపీ, సీడబ్ల్యూసీ తాజాగా స్పందించాయి. ఆయా రాష్ర్టాలు వెల్లడించిన అంశాలపై తమ అభిప్రాయాలు తెలుపుతూ శనివారం లేఖలు రాశాయి. అందులో సీడబ్ల్యూసీ వాదనలకు, ఏపీ వాదనలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసేందుకు గతంలో ఒప్పుకొన్న ఏపీ.. తాజా గా ఎలాంటి ముంపు ఉండబోదని తెలుపడం రెండునాల్కల ధోరణికి నిదర్శనం. ప్రాజెక్టును 150 అడుగులతో నిర్మించినా, కేవలం 145 అడుగుల వరకే నీటిని నిల్వ చేస్తారని, దీనివల్ల ఎలాంటి ముంపు ఉండదని కేంద్ర జలసంఘం ఏపీకి వంతపాడటంపై తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.