హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్లో భాగంగా కళాశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. పాలిటెక్నిక్ సెకండియర్ పూర్తిచేసి మధ్యలో ఆపేసిన వారికి డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఫెయిలైనా.. డిప్లొమాలో 90 క్రెడిట్స్ తెచ్చుకొంటే ఈ ప్రవేశాలకు అర్హులుగా పేర్కొన్నది. తాజా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్లో అధికారులు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇదివరకు పాలిటెక్నిక్ మూడేండ్లు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేవారు. మధ్యలో ఆపేస్తే చదువులు కొనసాగించే అవకాశం ఉండేదికాదు. తాజా నిర్ణయం మేరకు ఇంటర్ రెండేండ్ల తరహాలోనే పాలిటెక్నిక్ సెకండియర్ పూర్తిచేసి నేరుగా డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరవచ్చు.
డిప్లొమా సెకండియర్ పూర్తిచేసి వదిలేస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజినీరింగ్ను జారీచేయాలని ఇటీవలే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ నెల 6న సర్క్యులర్ ద్వారా ఆదేశాలిచ్చింది. తెలంగాణ సాంకేతిక విద్యామండలి (ఎస్బీటెట్) ఇటీవలే సర్టిఫికెట్ ఇన్ ఇంజినీరింగ్కు ఆమోదం తెలిపింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు పొందవచ్చు.
పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలో రెండేండ్ల పశుసంవర్థక (వెటర్నరీ) డిప్లొమా కోర్సు చేసిన విద్యార్థులకు డిగ్రీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో 113ను జారీ చేసింది. గతంలో డిప్లొమా కోర్సు అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే మళ్లీ ఇంటర్మీడియట్ చేయాల్సి వచ్చేది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులకు పశుసంవర్థక డిప్లొమా అభ్యర్థుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీ గణేశ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.