హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12 నుంచి 14 వరకు ఇండోమాచ్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్లో బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ జరగనున్నది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన ఈ ప్రదర్శనలో దేశంలోని దాదాపు 125 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ ప్రదర్శనలో 400 బ్రాండ్లకు చెందిన దాదాపు 500కు పైగా యంత్రాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు.
ఇంకా ఇంజనీరింగ్ ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, ఉపకరణాలు, సాధనాలు, సాంకేతిక పరికరాలు, ఉత్పత్తులు, ఇంజనీరింగ్ సాధనాలు, అనుబంధ ఉత్పత్తులు, సేవల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 500 మంది ప్రతినిధులు, 20 వేల మంది వ్యాపార సందర్శకులు ఎగ్జిబిషన్లో పాల్గొనవచ్చని అంచనా. సందర్శకులకు ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రవేశం ఉంటుందని, ఎలాంటి ప్రవేశ రుసుం లేదని నిర్వాహకులు తెలిపారు.