హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అ న్ని విభాగాలకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను నియమించింది. పోలీస్, ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, ఫారెస్ట్, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్, డీఆర్ఐ, ఈడీ, ఇన్కం టాక్స్, ఏవియేషన్, స్టేట్ బ్యాంకింగ్ నోడల్ ఆఫీసర్లు, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో వంటి విభాగాల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది.
తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలతో పాటు సమస్యాత్మక జిల్లాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 75 చెక్పోస్టులు ఏర్పాటు చేయగా, ఇ ప్పుడు వాటి సంఖ్యను 85కు పెంచుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రత్యేకంగా నియమించిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ బృందాల్లో తెలంగాణ పోలీసులకు అవకాశం కల్పించారు. భద్రత, వివిధ అంశాలకు సంబంధించి పోలీసులు సైతం ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు. డ్రగ్స్, గంజాయి, డబ్బు, మద్యం.. సహా స్వాధీనం చేసుకున్న వాటి వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు పంపుతున్నట్టు సమాచారం.