Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ స్పందించింది. సోషల్మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.
యాదగిరిగుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక అని పలు దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలు వైరల్ కావడంతో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి శనివారం నాడు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోని ఓ పోస్టు ఆధారంగానే పలు దినపత్రికలు ఆ వార్తను ప్రచురించాయని విచారణలో తేలింది. స్థానిక విలేకరులను కూడా అదనపు కమిషనర్ విచారించగా అలాంటి వార్తలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రయత్నించారని తెలిసిందని దేవాదాయ శాఖ కమిషనర్ అన్నారు. భక్తులు ఎవరు కూడా ఈ విషయమై యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులకు ఫిర్యాదు చేయలేదని విచారణలో తెలిసిందన్నారు. దేవస్థానం ప్రసాదాల తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నారు.