హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖలోకి ఇతర శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్పై తీసుకోవడాన్ని ఆ శాఖ ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయకుండా వేరే శాఖల ఉద్యోగులను దేవాలయాలకు ఈవోలుగా నియమించడాన్ని నిరసిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ కు చెందిన ఇద్దరు అధికారులను డిప్యుటేషన్పై దేవాదాయశాఖలోకి తీసుకుంటూ ఎండోమెంట్ కమిషనర్ హరీశ్ ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్ జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న సుశీల్రెడ్డిని చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవాలయ ఈవోగా నియమించడంతోపాటు ఆయనకు మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా అదనపు బాధ్యతలు కేటాయించారు. హనుమకొండ జిల్లా వేలేరు ఎంపీవోగా ఉన్న ఇమ్మడి భాస్కర్ను రామప్ప దేవాలయ ఈవోగా నియమించి అదనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థాన ఈవో బాధ్యతలు అప్పగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ బుధవారం దేవాదాయ అర్చక ఉద్యోగ సం ఘాలకు చెందిన ఆర్జేసీ, డీసీలు, ఏసీలు, సూపరింటెండెంట్లు, ఇతర ఉద్యోగులంతా కమిషనర్ హరీశ్ను, దేవాదాయశాఖ మంత్రి పీఎస్ సోమరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో 646 అసెసబుల్ దేవాలయాలు ఉన్నాయని, వాటిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం దేవాలయాల నిర్వహణకు సంబంధించి తమ శాఖలో 1 డిప్యుటీ కమిషనర్ (స్టేట్ క్యాడర్), 6 అసిస్టెంట్ కమిషనర్లు (మల్టీ జోనల్), 6 ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 ఆఫీసర్లు (జోనల్), 70 గ్రేడ్-3 ఎగ్జిక్యూటి వ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వీటిలో డిప్యుటీ కమిషనర్ పోస్టుకు డిప్యూటీ కలెక్టర్ లేదా అదే స్థాయిలో పేస్కేల్ ఉన్న అధికారి కావాలని, మిగతా పోస్టులకు అధికారుల అర్హతలను బట్టి వారి స్వీయ అనుమతితో నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కమిషనర్ పేర్కొన్నారు.
దేవాదాయ శాఖలో 233 రెగ్యులర్ ఈవో పోస్టులకు నియామకాలు లేనందున ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్పై తీసుకుని అవసరమైనచోట నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఇతర శాఖల ఉద్యోగులు కావాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ నిరుడు జూన్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్తోపాటు పలు శాఖలకు లేఖలు పంపారు.
తమ శాఖలో రెగ్యులర్ రిక్రూట్మెంట్లు పూర్తయ్యేవరకు ఎండోమెంట్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లుగా పనిచేయడానికి అర్హతలు కలిగిన ఉద్యోగులను డిప్యుటేషన్పై కేటాయించాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దీంతో అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేవాదాయ ఉద్యోగులంతా ఆందోళనకు దిగడంతో కొంత వెనక్కి తగ్గిన ఆ శాఖ ఉన్నతాధికారులు.. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ నుంచి కొత్తగా ఇద్దరిని తమ శాఖలోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ దేవాదాయ ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.