హైదరాబాద్: రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని 12,265 దేవాలయాల ప్రాంగణాల్లో దేవతా వృక్షాలు (జమ్మి చెట్లు) నాటాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే దసరా పండుగ నాటికి జమ్మి వృక్షాలతోపాటు విగ్రహారాధనకు పనికొచ్చే పూలమొక్కలు కూడా నాటాలని, అంతేకాకుండా నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత కార్యనిర్వహణ అధికారులదేనని ఆయన స్పష్టంచేశారు. బుధవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో అనిల్కుమార్ జమ్మిచెట్టును నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో జమ్మిచెట్లను నాటాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి కూరాకుల, సంయుక్త కమిషనర్ కృష్ణవేణి, రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘ జేఏసీ ఛైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.