హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కబ్జా కోరల్లో చిక్కిన సుమారు రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ తిరిగి స్వాధీనం చేసుకున్నది. తప్పుడు సర్వే నంబర్లతో సర్కారు భూములకు ఎసరు పెట్టిన కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. ఆక్రమణకు పాల్పడిన భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను పోలీసుల సాయంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ ట్రక్ టెర్మినల్ పార్కు నిర్మాణం కోసం 1990లో రైతుల నుంచి 181 ఎకరాల భూమిని సేకరించింది. సర్వే నంబర్లు 721, 724, 729లోని ఈ భూముల్లో 20 ఎకరాలలో నర్సరీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రెండు ఎకరాల భూమిని వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం కేటాయించింది. శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం 30 గుంటల భూమిని కేటాయించారు. ఖాళీగా ఉన్న ఓ 50 ఎకరాలను కొందరు ఆక్రమించుకొని చుట్టూ రేకులతో భారీ ఎత్తున ప్రీకాస్ట్ సరిహద్దు గోడను ఏర్పాటు చేశారు. లోపల రేకుల షెడ్డులు, ఇతర తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. వేర్వేరు సర్వే నంబర్లను బూచిగా చూపి ఈ ఆక్రమణలకు పాల్పడినట్టు తెలుస్తున్నది.
రాత్రికి రాత్రే కూల్చివేత
హెచ్ఎండీఏకు చెందిన భూములు అన్యాక్రాంతమవటంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ భూముల రికార్డులను పరిశీలించి, చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని 50 ఎకరాల మేరకు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన అధికారులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి శంషాబాద్ చేరుకున్న యంత్రాంగం రహదారులను బ్లాక్ చేసి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మంగళవారం తెల్లవారుజామున తాత్కాలిక నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. కూల్చివేతల్లో హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఏఈవోలు జనార్ధన్, జోగారావు, హెచ్ఎండీఏ తాసిల్దార్ ముంతాజ్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్, ఎస్సై సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.