జనగామ : తెలంగాణ మహిళల్లో సాధికారత పెరిగిందని, మహిళలు ఆర్థికంగా, వ్యాపారులుగా ఎదుగుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు మండలంలో శ్రీ వాణి ఎడ్యుకేషనల్, సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ నాగవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశేష కృషిచేసిన మహిళలను మంత్రి శాలువాతో సన్మానించి, అభినందించారు.
మంత్రి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకుని పోతున్నామని పేర్కొన్నారు.
మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చింది ఇద్దరే ముఖ్యమంత్రులని వారి ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్ అని తెలిపారు. మహిళలు ఐకేపీ, స్త్రీ నిధి ద్వారా వ్యాపారాలు, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారని వివరించారు.
కల్యాణ లక్ష్మి పథకం కింద సీఎం కేసీఆర్ పేదింటి ఆడపిల్లకు లక్షా 116 రూపాయలు మేనమామ కట్నం కింద ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ అందించడం వల్ల నీటి గోస పూర్తిగా తీరిందని పేర్కొన్నారు.మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు.