ఎస్సెస్సీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితహైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలుర కన్నా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 92.45 శాతంతో జయభేరి మోగించారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురతో పోలిస్తే బాలికలు 4.84 శాతం అధికంగా పాసయ్యారు. జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి గురువారం విడుదలచేశారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. హైదరాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఈ విద్యాసంవత్సరం 3,007 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో 1,507కు పైగా సర్కారు బడులు, గురుకులాలుండగా, 1,500 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు గణితంలోనే ఫెయిలయ్యారు. 15 స్కూళ్లల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. వాటిలో ఎయిడెడ్ 1, ప్రభుత్వ బడులు 2, ప్రైవేట్ స్కూళ్లు 9, జిల్లా పరిషత్ పాఠశాలలు 3 ఉన్నాయి.
పది ఫలితాల్లో కూడా గురుకులాలు సత్తాచాటాయి. కేజీబీవీలు, మాడల్ స్కూళ్లు సైతం ఉత్తమ ఫలితాలు సాధించాయి. రాష్ట్రంలో బీసీ గురుకులాలు 132, మైనార్టీ 202, ఎస్సీ 235, గిరిజన 94, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు 52, కేజీబీవీలు 475, మాడల్ స్కూళ్లు 194 ఉండగా, ఇవన్నీ ప్రైవేట్ స్కూళ్లను మించి ఉత్తమ ఫలితాలను సాధించాయి. వీటిల్లో కనిష్ఠంగా 93 శాతం, గరిష్ఠంగా 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే ప్రైవేట్ స్కూళ్లు 4,998 ఉండగా, వీటిల్లో 91 శాతం ఉత్తీర్ణత మాత్రమే వచ్చింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
కొవిడ్ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టిన అధికారులు, టీచర్ల చొరవను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా బోధన చేపట్టడమే కాకుండా ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులు పెట్టి, వర్క్షీట్లను పంపడంతోపాటు ఇంటింటికెళ్లి పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారని, ఇందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైన జిల్లాలపై ఎక్కువ దృష్టి సారిస్తామని చెప్పారు. ఏయే స్కూళ్లల్లో మార్కులు తక్కువ వచ్చాయో నివేదికలు తెప్పించుకొని, పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా ప్రతి ఏటా ఫలితాల్లో చివరిస్థానంలో నిలువడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ అంశంపై చర్చించి, చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ ఏడాది ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల్లో సున్నా మార్కులు వచ్చిన సమాధాన పత్రాలను సుమోటోగా స్వీకరించి మరోమారు పరిశీలించాలని సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొందరు విద్యార్థులకు సున్నా మార్కులు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయని, దీనిపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఇంటర్ బోర్డు, ఎస్సెస్సీ బోర్డుల ద్వారా మరోమారు పునఃపరిశీలన జరుపాలని సూచించారు.
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మంత్రి సబిత వెల్లడించారు. వారానికి రెండు రోజులు లేదా రోజుకు గంట చొప్పున క్లాసులను నిర్వహించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో విద్యార్థులు పాసయ్యేలా చూస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు దీనిని భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, అవసరమైతే జిరాక్స్ పేపర్లను కూడా ఇస్తామని చెప్పారు.
పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు ఒకటి నుంచి 10 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు. విద్యార్థులు జూలై 18వ తేదీలోగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో పరీక్షలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చని తెలిపారు. హెచ్ఎంలు జూలై 20 లోపు ట్రెజరీలో చెల్లించి, 21లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సైతం ఆగస్టు 1 నుంచి 10 వరకు జరుగనున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తవని భావించి రెండు పరీక్షలను ఒకేసారి నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.