కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల ఫలితం
90శాతం ఉపాధి హామీ పనిదినాలు పూర్తి
పనిదినాలపై కేంద్ర బడ్జెట్ కోతల ప్రభావం
కేసీఆర్ హెచ్చరించినా కదలని మోదీ
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): భయపడ్డట్టే జరుగుతున్నది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న సీఎం కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి. పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఈసారి బడ్జెట్లో భారీగా నిధులకు కేంద్రం కోతపెట్టడంతో ఆ ప్రభావం పనిదినాలపై చూపడం మొదలుపెట్టింది. రాష్ర్టానికి తక్కువ పనిదినాలు కేటాయించడంతో ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 75 రోజుల్లోనే 90శాతం పనిదినాలు పూర్తయ్యాయి. దీంతో కేంద్రం అదనపు పనిదినాలు కేటాయిస్తేనే ఉపాధి హామీ కూలీలకు పని దొరుకుతుంది. లేకుంటే అంతే సంగతులు.
మున్ముందు అదనపు పనిదినాల మంజూరు విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉపాధి హామీ పనులపై కూలీలకు ఇన్నాళ్లుగా ఉన్న భరోసా కేంద్రం చర్యల ఫలితంగా సన్నగిల్లుతున్నది. 2022-23 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేటాయించే నిధుల్లో రూ.25 వేల కోట్లు కేంద్రం కోత పెట్టింది. ఆ మేరకు రాష్ర్టానికి కేటాయించే పనిదినాల్లోనూ అధికారులు కోత పెట్టారు. అప్పట్లోనే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఆందోళన వ్యక్తంచేశారు. కూలీల పొట్ట కొట్టొద్దని సూచించారు. కేంద్రం వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు.
33 శాతం ప్రతిపాదనలకు కోత…
2022-23లో రాష్ర్టానికి 10 కోట్ల పనిదినాలనే కేంద్రం కేటాయించింది. ఇప్పటికే 9 కోట్ల పనిదినాలు (90 శాతం) పూర్తయ్యాయి. రాబోయే 9 నెలలుపాటు రాష్ట్ర అధికారులు అదనపు పనిదినాల కోసం కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపించాల్సి ఉంటుంది. పక్షం రోజులకోసారి అదే పనిగా ప్రతిపాదనల్ని పంపితేకానీ అదనపు పనిదినాలు మంజూరు కావు. ప్రతి సంవత్సరం రాష్ర్టానికి 13-14 కోట్ల వరకు పనిదినాల్ని కేంద్రం కేటాయించేది. వాటితో డిసెంబర్ వరకు కూలీకు ఉపాధి దొరికేది. ఈసారి అందుకు భిన్నంగా 10 కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించడంతో జూన్ చివరికల్లా అవి పూర్తయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ప్రతి మూడు వారాలకు ఒకసారి కేంద్రాన్ని ప్రాధేయపడాల్సి ఉంటుంది. కూలీలకు ఇవ్వాల్సిన పనుల్లో కోత పెట్టి.. నిధుల కోసం అధికారులు లేఖలు రాసే పరిస్థితిని కేంద్రం కల్పించింది. గత సంవత్సరం 14.40కోట్ల పనిదినాలను తెలంగాణ రాష్ట్రం పూర్తిచేసింది. ఈసారి 15కోట్ల పనిదినాల్ని కేటాయించాలని రాష్ట్రం కోరగా.. 33 శాతం కేంద్రం కోత పెట్టింది.
సగటున 11 లక్షల మంది..
తెలంగాణలో ప్రస్తుతం రోజుకు సగటున 11లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 2.85 కోట్ల పనిదినాలు పూర్తిచేయగా.. ఈ సంవత్సరం ఏప్రిల్లోనూ అదే సంఖ్యలో పనిచేశారు. గత సంవత్సరం మే నెలలో 3.96 కోట్ల పనిదినాలను పూర్తిచేయగా, ఈసారి మే నెలలో 4.35 కోట్ల పనిదినాలను పూర్తిచేశారు. జూన్ నెలలో రెండు కోట్ల పనిదినాలకు చేరువలో ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి చేసే పనులకు కేంద్రం అనుమతి ఇస్తేనే కూలీలకు డబ్బులు వస్తాయి. లేకుంటే లేదు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడిచేందుకే ఇలా దాన్ని నిర్వీర్యపరుస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు చూపాల్సిన ఉపాధి విషయంలో కేంద్రం తన బాధ్యతనుంచి క్రమంగా తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నదని వారు స్పష్టంచేస్తున్నారు.
ఉపాధి హమీకి 376.75 కోట్లు విడుదల
పరిపాలన అనుమతులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 376.75 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా గురువారం రెండు జీవోలు జారీ చేశారు.