హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కోట్లమంది నిరుపేదలున్న మనదేశంలో.. వారందరికీ ఉపాధి కల్పించాలన్న గొప్ప సంకల్పంతో రూపుదిద్దుకొన్నదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పథకం ప్రారంభంలో పేదలకు ఉపాధి కల్పించటంపైనే శ్రద్ధపెట్టిన ప్రభుత్వాలు.. ఆ పథకంలో చేపట్టిన పనులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్న విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో మొదట్లో ఈ పథకంలో భాగంగా రోడ్ల వెంట తుప్పలు నరికేయటం, చెట్లు తొలగించటం వంటి సాదాసీదా పనులే చేపట్టేవారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇదే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఈ పథకంలో చేపట్టే పనులు దీర్ఘకాలం ఉపయోగపడేవిగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించారు. దీంతో రైతులకు కల్లాల నిర్మాణం వంటి పనులు కూడా చేపట్టారు. కానీ, కేంద్ర ప్రభుత్వానికి ఈ పనులు అస్సలు నచ్చటంలేదు. కల్లాలు నిర్మించటం ద్వారా ఉపాధి నిధులను దుర్వినియోగం చేశారని యాగీ చేస్తున్నది. వెంటనే రూ.151.9 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ర్టానికి హుకుం జారీచేసింది. ఈ నెల 30వ తేదీలోపు ఆ నిధులను చెల్లించకుంటే.. ఈ పథకంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పెడుతామని బెదిరిస్తూ లేఖ రాసింది.
కల్లాలు వ్యవసాయ పని కాదా?
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దటంతో వ్యవసాయం భారీగా పెరిగింది. నీళ్లు పుష్కలంగా ఉండటంతో రైతులు ఏటా లక్షల టన్నుల వరిధాన్యం పండిస్తున్నారు. దానిని ఆరబెట్టడం, నిల్వ చేయటానికి రైతులందరికీ వీలు పడటంలేదు. చాలామంది రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్.. గ్రామాల్లో వ్యవసాయ కల్లాలు నిర్మించాలని నిర్ణయించారు. రైతులు కొంతమొత్తం చెల్లిస్తే.. మిగతాది ప్రభుత్వం అం దించి కల్లాలు నిర్మించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఇది మహా పాపంగా కనిపిస్తున్నది.
ఉపాధి పనుల్లో కల్లాల నిర్మాణం అని లేదని, అందువల్ల నిధులు దుర్వినియోగం అయినట్టేనని వాదిస్తున్నది. నిజానికి ఉపాధి హామీ పథకం లో గుర్తించిన 27 పనుల్లో 15 నుంచి 27 వరకు వ్యవసాయం, దాని అనుబంధ పనులే ఉన్నాయి. భూమి చదును చేయటం, కందకాలు తవ్వటం, కాంటూర్ కట్టలు నిర్మించటం వంటి పనులు ఇందులో ఉన్నాయి. కానీ, కల్లాలు మాత్రం నిర్మించరాదని కేంద్ర ప్రభుత్వం వాదించటంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం వివక్షకు ఇది పరాకాష్ట అని విమర్శిస్తున్నారు.
రాష్ట్రంపై కేంద్ర అధికారుల దండయాత్ర
ఉపాధి పథకం పనులు చేయటంలో దేశంలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నది. అయినా, కేంద్రం ప్రతిసారి ఏదో ఒక కుంటిసాకు చెప్తూ నిధుల విడుదలలో కిరికిరి పెడుతున్నది. గత జూన్లో రాష్ట్రంపై దండయాత్ర చేసినట్టుగా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఢిల్లీ నుంచి అధికారుల బృందాలు వచ్చి ఉపాధి పనులపై తనిఖీలు నిర్వహించాయి. ఏదో ఒకరకంగా తప్పులు జరిగాయని చెప్పటమే లక్ష్యంగా పనిచేశాయి. ఎప్పుడో రెండేండ్ల క్రితం చేపట్టిన చెరువుల పూడికతీత, అడవుల్లో కందకాల నిర్మాణ పనులు ఎక్కడ చేశారో చూపించాలని అడగటంతో రాష్ట్ర అధికారులు విస్తుపోయారు. రాష్ట్రంపై కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఇదంతా చేయించిందని విమర్శలు వచ్చాయి.