నాగార్జున సాగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా NCCOEEE తెలంగాణ యూనిట్ పిలుపుమేరకు.. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద NSHES ఉద్యోగులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల లాభార్జన ధ్యేయంగా విద్యుత్ సంస్థలు, సహజ వనరులను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యుత్ సవరణ బిల్లును చట్టంగా మార్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీని వల్ల దేశ వ్యాప్తంగా సమస్త ప్రజానీకం, రైతాంగం, విద్యుత్ ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఒంటెద్దు పోకడ విధానాన్ని, తన మొండి వైఖరిని విరమించుకోకపోతే, వర్క్ బై కాట్, మెరుపు సమ్మె లాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వెనకాడబోమని ఉద్యోగులు హెచ్చరించారు.
అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.