హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలపై పీటముడి నెలకొని ఉన్నది. అధికారుల తీరువల్ల బదిలీలు ఉంటాయో.. లేవోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 31లోపు ప్రక్రియను పూర్తిచేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దాదాపు అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీల కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కూడా స్వీకరిస్తున్నారు. కానీ సాంకేతిక విద్యాశాఖలో మాత్రమే ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రెండేండ్ల క్రితం (2024లో) 40శాతం ఉద్యోగుల బదిలీలు చేపట్టగా, ఆ తర్వాత మళ్లీ అవకాశం కల్పించలేదు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి మొదలు ప్రిన్సిపాల్స్ క్యాడర్ వరకు బదిలీలు చేపట్టాల్సింది. 400కు పైగా ఉద్యోగులు బదిలీ అవుతారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. 2024లో బదిలీల సమయంలో కొందరు ఉద్యోగులు 15 రోజుల సర్వీస్ తక్కువగా ఉన్నందుకు అప్ప ట్లో బదిలీకి నోచుకోలేకపోయారు. తాజా బదిలీల్లో అవకాశం కోసం చూస్తుండగా కదలిక లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉన్నతాధికారుల వైఖరితోనే ఈ పరిస్థితి నెలకొన్నదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈనెల 31 గడిస్తే బదిలీలపై నిషేధం విధిస్తారు. ఆ తర్వాత మళ్లీ బదిలీలకు అవకాశం ఉండదన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్రెడ్డి, ఉన్నతాధికారులు కల్పించుకుని సాంకేతిక విద్యాశాఖలో బదిలీలు చేపట్టాలని, లేదంటే ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.