హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్లో విధుల నుంచి తొలగింపునకు గురైన ముగ్గురు తాతాలిక ఉద్యోగులకు హైకోర్టు ఊరట కల్పించింది. 2019లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లుగా నియమితులైన ఆ ముగ్గురినీ మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. కానీ, వారి సర్వీసుల క్రమబద్ధీకరణకు నిరాకరించింది. యూజీసీ పథకం నిలిచిపోయిందని చెప్తూ మార్చి 31న తమను అన్యాయంగా విధుల తొలగించారంటూ దాసరి కోటయ్య, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ మాధవీదేవి సోమవారం విచారణ జరిపారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి వరకు యూజీసీ పథకం అమలవుతుందని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. దీనిపై వర్సిటీ న్యాయవాది స్పందిస్తూ.. తాత్కాలిక ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాల్సి ఉన్నదని, పిటిషనర్లు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రావాలని చెప్పారు. దీంతో పిటిషనర్లపై ఎలాంటి ఫిర్యాదు లేనందున వారిని ఔట్ సోర్సింగ్లో రావాలనడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం యూజీసీ పథకం కొనసాగుతున్నందున పిటిషనర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వర్సిటీని ఆదేశించారు.