వేములవాడ, డిసెంబర్ 2: జోన్లవారీగా ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించే సమయంలో ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. కోరుకున్న విధంగా పీఆర్సీ అమలు కావడంతో గురువారం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు జోన్లుగా ఉన్న రాష్ట్రంలో ఏడు జోన్లతోపాటు రెండు మల్టీజోన్లు ఏర్పడ్డాయన్నారు. వీటిపై ఉద్యోగుల్లో అనేక అపోహలు ఉన్నాయని తెలిపారు. బదిలీ క్రమంలో తప్పనిసరిగా జిల్లాల వారీగా ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. కేసీఆర్ ఉద్యోగులతో ఫ్రెండ్లీ సీఎంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే పీఆర్సీని కోరిన విధంగా అమలు చేశారని చెప్పారు. పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల కాలాన్ని రెండేండ్లకు కుదించినప్పటికీ అధికారులు కొందరు ప్రెసిడెన్సీ ఉత్తర్వులను చూపుతూ మోకాలడ్డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.