హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. హైదరాబాద్లోని టీఎన్జీవో కార్యాలయంలో, బీఆర్కే భవన్లో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించారని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఫిట్మెంట్ ప్రకటించడం హర్షణీయమని చెప్పారు. చిల్లర సంఘాలు అని ఎద్దేవా చేసినవాళ్ల నోర్లు మూతపడేలా ఫిట్మెంట్ ప్రకటించారని చెప్పారు. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కష్టాన్ని తండ్రిలా పరిష్కరించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని టీఎన్జీవో నేత ముజీబ్ అన్నారు.
నిజామాబాద్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లలకు 30శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగులకు పీఆర్సీ వర్తిస్తుందని చేప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.